Failed to fetch language order
జై శ్రీకృష్ణ.. జైజై శ్రీకృష్ణ💐
1K Posts • 2M views
Satya Vadapalli
505 views 2 months ago
శ్రీమదాంధ్ర భాగవతం దశమస్కంధం - 29 *దశమ స్కంధము - ఉత్తర భాగము - ప్రద్యుమ్నకుమార చరిత్ర* పోతనామాత్యుల వారు దశమస్కంధము ఉత్తరభాగమును ప్రారంభిస్తూ - *శ్రీకర!పరితోషితరత్నాకర! కమనీయ గుణగణాకర! కారు ణ్యాకర! భీకరశర ధారాకంపిత దానవేంద్ర! రామనరేంద్రా!!* వారు ఏది ప్రారంభం చేసినా ఒక్కసారి రామచంద్ర ప్రభువును ప్రార్థన చేస్తారు. ‘శ్రీకర’ – సమస్త ఐశ్వర్యములను కటాక్షించువాడా! అపారమయిన కారుణ్యమునకు అవధి అయిన వాడా! శత్రువులను పరిమార్చకలిగిన వాడా! రామచంద్ర ప్రభో! భాగవతం ఉత్తరభాగమును ఆంధ్రీకరణం ప్రారంభం చేస్తున్నాను’ అన్నారు. దీనిలో మనం తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉన్నది. *మనము ఏ పనిమీద తిరుగుతున్నా భగవంతుని స్మరణ మాత్రం విడిచిపెట్టకూడదు. దేహముతో తాదాత్మ్యత చెందిపోకూడదు. ఏ పని చేస్తున్నా ఈశ్వరుడి పట్ల కృతజ్ఞత భక్తుడయిన వాడికి అలవాటు కావాలి. సంతతము ఆ భగవంతుడిని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాడు. ‘నా అంతటి వాడిని నేను’ అని అనకూడదు. అలా అంటే మీ స్థితి ఏమిటో చూపించడానికి ఈశ్వరుడికి ఒక్క క్షణం చాలు.* ఆయన మహా దయాళువు. అలా చెయ్యడు. ఆయన ఎన్ని ఆగడములనయినా సహిస్తాడు. అందుకనే ఎంతో గొప్పమాట అంటారు. కమనీయ గుణగణాకర! కారుణ్యాకర!’ మహా కారుణ్యము కలిగినటువంటి వాడా – రామచంద్రప్రభో! అని ప్రారంభం చేశారు. దీనిని అలవాటు చేసుకోవలసిన అవసరం ఉంటుంది. *భాగవతమును వినేవాడు, భాగవతమును చదివేవాడు జీవితములో ప్రత్యేకముగా అస్తమానూ ఈశ్వరుడిని జ్ఞాపకమునకు తెచ్చుకోవడం, కష్టం వచ్చినా సుఖం వచ్చినా దానిని ఈశ్వరునితో అనుసంథానం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. జీవితంలో ఇంతకన్నా గొప్ప వరం ఉండదు.* రుక్మిణీ కృష్ణుల వివాహం పూర్తయింది. రుక్మిణీదేవికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ పురుటికందుని చూసుకొని ఆమె పరవశించి పోయింది. ఆవిడ ఆదిలక్ష్మి. ఆమె నుండియే మిగిలిన అష్టలక్ష్ములు వస్తాయి. ఆవిడ ఒక నరకాంతగా ఉన్నప్పుడు కూడా తల్లి ప్రేమకు అతీతముగా ఉండడానికి ఇష్టపడదు. ఆవిడ తల్లి ప్రేమను తల్లి ప్రేమగానే ఉంచుతుంది. ఆ పురిటి మంచం మీద బిడ్డడికి పాలు ఇచ్చి బిడ్డడిని నిద్రపుచ్చి తాను నిద్రపోయింది. ఆ పిల్లవాడు నిద్రపోతుండగా శంబరాసురుడనే రాక్షసుడు అంతఃపురంలోకి కామరూపియై ప్రవేశించాడు. పొత్తిళ్ళలో ఉన్న ప్రద్యుమ్నుడనబడే చిన్న బిడ్డడిని అపహరించి తీసుకొని వెళ్ళిపోయి ఆ పిల్లవాడిని చంపివేయడానికి ఒక మహాసముద్రంలో పారేశాడు. ఇది మీరు జాగ్రత్తగా గమనించ వలసిన లీల. ఈ లీలను గాని మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోగలిగారంటే ఈశ్వరుని దివ్యమయిన అనుగ్రహం, కారుణ్యం, ఆయన ఎంత లెక్కలు వేసి ఉంచే మనిషి, ఆయన సంకల్పముతో ఎలా ఏమి జరుగుతాయన్నది అర్థం అవుతుంది. భక్తి ప్రచోదనం అయ్యేంత గొప్ప పద్యమును ఇచ్చారు. *తామరసాక్షునంశమున దర్పకు డీశ్వరుకంటిమంటలం దా మును దగ్ధుడై పిదప దత్పరమేశుని దేహలబ్ధికై వేమఱు నిష్ఠ జేసి హరి వీర్యమునం బ్రభవించె రుక్మిణీ కామిని గర్భమం దసురఖండను మాఱట మూర్తియో యనన్!!* ఒకానొకప్పుడు పరమశివుడు తపస్సు చేస్తున్నాడు. పార్వతీదేవి ఆయనకు ఇల్లాలు కావాలి. లేకపోతే తారకాసుర సంహారం జరగదు. పరమశివుని కుమారుడు మాత్రమే తారకాసురుని నిర్జించగలడు. ఆ మేరకు తారకాసురుడు వరమును పొంది ఉన్నాడు. అందుకని పార్వతీ పరమేశ్వరులను కలపడం కోసమని మన్మథుడు బయలుదేరాడు. మన్మథుడు శ్రీమహావిష్ణువు కుమారుడు. శ్రీమహావిష్ణువు అందం అంతా మన్మథునికి వచ్చింది. మన్మథుడు అనగా మనస్సులను మథించగలిగిన వాడని అర్థం. ఆయన పుష్ప బాణుడై అవతలవారి మనస్సులను కదుపుతాడు. ఇంద్రుడు అడిగితే పరమశివుని మీదకు బాణ ప్రయోగం చేయబోయాడు. శివునిలో చిన్న మార్పు కలిగింది. ఆయన అనుమానం వచ్చి చూశాడు. పొదలో కూర్చుని వింటినారి సారిస్తున్న మన్మథుడు కనపడ్డాడు. అంతే! మూడవకన్ను తెరిచాడు. కాముడు భస్మమయిపోయాడు. అతను హర తేజస్సుచేత కాల్చబడ్డాడు. అది మామూలు అగ్నిహోత్రం కాదు. మూడవకంటి మంట. ఇంక దానికి ఎదురులేదు. మన్మథుడు దగ్ధమయి పోయాడు. శివుడికి ఉన్న మూడు నేత్రములు అయిన సూర్యచంద్ర అగ్నిహోత్రముల చేత కాలి బూడిదరాశియై పడిపోయాడు. మన్మథుడు కాలిపోవడం పరమశివునకు విజయము. ఎందుకనగా ఆయన కామదహనం చేశాడు. కామునికి లొంగడు. మన్మథుడు దహింపబడడం వలన రతీదేవికి అపకారం జరిగింది. రతీదేవికి భర్త పోయాడు. ఆమెకు ఎవరు అయిదవతనమును ఇవ్వడంలో సమర్థులో, ఎవరిని పరమశివునితో చేర్చడం వలన వాళ్ళిద్దరికీ కలిగిన కుమారుడి వలన దేవతలు ప్రయోజనము పొందుతారనే భావనచేత మన్మథుడు బానప్రయోగం చేశాడో, అటువంటి భర్తను తనకు ఇమ్మనమని పార్వతీదేవిని, పార్వతీ పరమేశ్వర కళ్యాణం తరువాత రతీదేవి అడిగింది. పరమశివుని మంట చేత కాలిపోయిన మన్మథుని మరల పార్వతీదేవి బ్రతికించింది. అమ్మవారి శక్తికి పరిమితి లేదు. అందువలననే కాలి బూడిద అయిపోయిన వానిని తిరిగి బ్రతికించగలిగినది. ఆవిడ ఏదయినా చేయగలదు. శక్తి స్వరూపమయిన ఆమె రతీదేవికి ‘నీ అయిదవతనమునకు భంగం లేదు. నీ భర్త అనంగుడు అవుతాడు శరీరం ఉండదు. ఎవ్వరికీ కనపడడు. నీకు మాత్రం కనపడతాడు’ అని వరం ఇచ్చింది. రతీదేవికి తన పతిని శరీరముతో చూడాలని కోరిక కలిగింది. పరమశివుడు మన్మథునితో ‘ శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడిగా అవతరించినపుడు నీవు ఆయనకు కుమారుడిగా జన్మించెదవుగాక! రతీదేవి నిన్ను శరీరంతో చూడగలదు’ అని వరం ఇచ్చాడు. ఈ పుట్టిన మన్మథుడు రాక్షస సంహారమునకు శ్రీమన్నారాయణుడే మరొక అవతారం ఎత్తాడా అన్నట్లుగా ఉన్నాడు. హరుని కంటిమంటచేత కాలిపోయిన వాడు ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మకు కుమారుడిగా జన్మించాడు. భూదేవి వెళ్లి ప్రార్థన చేస్తే శ్రీమన్నారాయణుడు ‘తాను రాక్షస సంహారం చేసి భూభారమును తగ్గిసాను’ అని అభయం ఇచ్చాడు. ఆయన ఒకటి, ఆయన కుమారుడు ఒకటి కాదు కదా! ఈయన కూడా రాక్షస సంహారం చేయవలసి ఉన్నది. ఈయన వలన మరణించే శంబరాసురుడనే రాక్షసుడు ఉన్నాడు. వానికి ఈ విషయం తెలుసు. తన మృత్యువునకు ఏది కారణమని భావించాడో దానిని తీసివేసే ప్రయత్నం చేశాడు. శంబరాసురుడు ప్రద్యుమ్నుడిని సముద్రంలోకి విసిరేశాడు. పిల్లవాడు చచ్చిపోయి ఉంటాడని భావించి తన గృహమునకు వెళ్ళిపోయాడు. ఈశ్వర సంకల్పం చేత ఆ బాలుడు బ్రతికాడు. విచిత్రం ఏమిటంటే ఆ పిల్లవాడు శంబరాసురుని ఇంటికే వెళ్ళాడు. శంబరాసురునిచే విసిరి వేయబడిన వాడిని ఒక చేప మింగేసింది. ఆ చేపను జాలర్లు వలవేసి బయటకు తీసి ఒడ్డుకు వచ్చి రంపముతో దాని కడుపు కోయగా కడుపులో చంటిపిల్లవాడు కనపడ్డాడు. ఆశ్చర్యపోయి ఆ పిల్లవాడిని కానుకగా ప్రభువుకు ఇద్దామని వాళ్ళ ప్రభువయిన శంబరాసురుని వద్దకు వెళ్లి జరిగింది చెప్పారు. శంబరాసురుడు మాయకు వశుడయ్యాడు. ఈలోగా రతీదేవి తన భర్త మన్మథుడు కృష్ణ పరమాత్మకు కొడుకుగా, ఈ మాంసనేత్రముతో చూడగలిగే వానిగా పుడతాడని ఎదురుచూస్తోంది. రతీదేవి మాయాదేవి అనే పేరుతో శంబరాసురుని వంటశాలలో ఉన్నది. ఈమె శంబరాసురుని వద్దకు వెళ్లి ఆ పిల్లవాడిని తనకివ్వమని, వానిని తాను పెంచుకుంటానని చెప్పింది. ఆ పిల్లవాడిని ఆమెకు ఇచ్చేశాడు. ప్రపంచంలో ఎవరయినా తన భర్తను భర్తగా మాత్రమే చూడగలరు. భర్తను పసిపిల్లవానిగా రతీదేవి సాకింది. ఈయన పెరిగి పెద్దవాడయ్యాడు. రతీదేవి తన భర్త అనే భావనతోనే పెంచి పెద్ద చేసింది. ఆయనకు తాను మన్మథుడనని తెలియదు. రతీదేవికి తెలుసు. ప్రద్యుమ్నుడికి యౌవనము వచ్చిన తరువాత ఈమె చేష్టితములను కనిపెట్టాడు. ఈమె ప్రవర్తనయందు దోషమును కనిపెట్టి ‘నీవు మాతృత్వమునకే కళంకం తెస్తున్నావు. నీ ప్రవర్తన యందు దోషం కనపడుతున్నది. ఎందుకు నీయందు ఈ విధమయిన విచిత్రమయిన ప్రవర్తన జరుగుతోంది?’ అని అడిగాడు. ఆవిడ జరిగిన విషయమును తెలియజెప్పి ఆ అమ్మకు ఉన్న కష్టమును పరిమార్చి నీవు మరల అమ్మవద్దకు చేరవద్డా’ అని అడిగింది. ఆయనలో ఉన్న మాతృ భావమును ఎవరి వైపుకి తిరగాలో వారి వైపుకి తిప్పింది. అవతార ప్రయోజనమును పూర్తి చేయిస్తున్నది. ప్రద్యుమ్నుడు ‘ఉత్తర క్షణం నేను నా తల్లిని చేరుకోవాలనుకుంటున్నాను. నేను వెంటనే శంబరాసురుణ్ణి చంపేస్తాను’ అన్నాడు. ఆమె ‘నీవు అంత తొందరగా వాడిని చంపలేవు. వాడి దగ్గర గొప్ప మాయలు ఉన్నాయి. ఆ మాయలను నిర్జించడం ఎవరివల్లా కాదు. నీకిప్పుడు ఒక మంత్రోపదేశం చేస్తాను. ఒక విద్యను నీకు ఉపదేశిస్తాను. ఆ విద్యపేరు మహామాయా విద్య’ అని ఆ విద్యను బోధచేసింది. అమ్మవారికి పన్నెండుమంది ఉపాసకులను చెపుతారు. *మనుశ్చంద్ర కుబేరస్య లోపాముద్రాచ మన్మథః అగస్తీరగ్నిసూర్యశ్చ ఇంద్రస్కంధశ్శివస్తథా క్రోధభట్టారకోదేవ్య ద్వాదశాని ఉపాసకాః.* ఈ పన్నెండుమంది అమ్మవారి ఉపాసకుల గురించి విన్నా, వాళ్ళ గురించి చెప్పినా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారు పరమ ప్రీతి చెందుతుంది. అందుకే రుక్మిణీ కళ్యాణం ప్రక్కనే ప్రద్యుమ్నోపాఖ్యానమును ఇచ్చారు. స్త్రీలు పెళ్ళయిన తరువాత మాతృత్వమును కోరుకుంటారు. ఆ మాతృత్వం నిలబడడానికి మహామాత అనుగ్రహం కలగాలి. రుక్మిణికి ప్రద్యుమ్నుడు పుట్టడమును అడ్డుపెట్టి అమ్మవారి అనుగ్రహమును పోతనగారు కథలోకి తీసుకువచ్చారు. ప్రద్యుమ్నుడు మహా మాయా తత్త్వమును పొంది శంబరాసురుని మీదికి యుద్ధమునకు వెళ్ళాడు. వాడికి ఈ సత్యం తెలియగానే తోక త్రొక్కిన త్రాచులా లేచి ప్రద్యుమ్నుడితో యుద్ధమునకు బయలుదేరాడు. ప్రద్యుమ్నుడు తనకు ఉన్నటువంటి మహా మాయాశక్తి చేత అన్ని అస్త్రశస్త్రములను అణచివేసి తరువాత కత్తితో శంబరాసురుని కుత్తుక ఖండించివేశాడు. ఎవరిచేతిలో శంబరాసురుడు చచ్చిపోవాలని ఈశ్వరుడు సంకల్పం చేశాడో వానిచేతిలోనే చచ్చిపోయాడు. అలా చంపివేసిన తరువాత ఒక చిత్రం జరిగింది. వెంటనే ప్రద్యుమ్నుడు అమ్మని చూడడానికి వెళ్ళాలి కదా! ఇక్కడ జరుగుతున్న విషయములన్నీ కృష్ణుడికి తెలుసు. ప్రద్యుమ్నుడి జాడ తెలియనట్లు ఊరుకున్నాడు. శంబరాసుర సంహారం జరగాలని ఆయనకి తెలుసు. కృష్ణ పరమాత్మ చెప్పింది మాత్రమే మనం చెయ్యాలి తప్ప ఆయన చేసింది మనం చేయకూడదు. కృష్ణుడిది పరిపూర్ణావతారం. కృష్ణుడిని అనుకరించకూడదు. ప్రద్యుమ్నుడు రతీదేవితో కలిసి ఆకాశమార్గంలో రుక్మిణీదేవి అంతఃపురమునకు వెళ్ళాడు. అక్కడ ఒక ఆశ్చర్యకర సంఘటన జరిగింది. కృష్ణుడు ఎలా ఉంటాడో ప్రద్యుమ్నుడు కూడా ముద్ర గుద్దినట్లు అలానే ఉంటాడు. అంతఃపుర పరిచారికలు అచ్చం శ్రీకృష్ణునిలా ఉన్న ప్రద్యుమ్నుని చూసి కృష్ణుడే వస్తున్నాడని ఎక్కడి వాళ్ళు అక్కడే స్తంభముల చాటుకి తప్పుకున్నారు. కొందరు కృష్ణుని కొడుకులా ఉన్నాడు అనుకున్నారు. రుక్మిణీదేవి మందిరం ఎక్కడ ఉన్నదాని అమ్మ గురించి వెతుకుతున్నాడు ప్రద్యుమ్నుడు. పరిచారికలు రుక్మిణీదేవి వద్దకు వెళ్లి ‘అమ్మా! ఎవరో ఆకాశమునుండి మన మందిరంలోకి దిగారు. అచ్చం కృష్ణుడి లాగానే ఉన్నారు. మీరు చూడవలసినది’ అని చెప్పారు. రుక్మిణీదేవి గబగబా మేలిముసుగుతో వచ్చి చూసింది. ఆవు దూడను చూసినప్పుడు ఎలా ఉంటుందో ఆమె చూపు అలా అయింది. ఆమెలో పుత్రవాత్సల్యం తన్నుకు వచ్చి ఆమె స్తన్యములలో పాలు చేపునకు వచ్చాయి. ఆవిడ 'ఈపిల్లవాడు చాలా అందంగా ఉన్నాడు. నా కొడుకు బ్రతికి ఉన్నట్లయితే ఇప్పటికి ఇంతయి ఉండేవాడు. ఈతడు నా కొడుకే అయివుండాలి’ అనుకున్నది. అమ్మ ఇరువది అయిదేళ్ళ తరువాత తన కుమారుని గుర్తు పట్టింది. ఈలోగా అక్కడికి కృష్ణ భగవానుని తీసుకువచ్చారు. ఆయన మహా మాయావి. ఆయన వచ్చి ఒకసారి రుక్మిణి వంక, ఒకసారి ప్రద్యుమ్నుని వంక చూసి ప్రద్యుమ్నుని ‘నీవు ఎవరు?’ అని ప్రశ్నించారు. ప్రద్యుమ్నుడు సమాధానం చెప్పే లోపల అక్కడికి మహాజ్ఞాని అయిన నారదుడు వచ్చి‘ నీకు తెలియని విషయమా! ఆనాడు మన్మథుడు కాలి బూడిద అయిపోతే వరం ఇచ్చారు కదా! దాని ప్రకారం మన్మథుడు ప్రద్యుమ్నుడిగా జన్మించాడు. చిన్నతనంలో శంబరాసురుడు అపహరించాడు. ఇతడు శంబరాసురుణ్ణి సంహరించి రతీదేవితో కలిసి వచ్చాడు. నీ ఇంటికి కొడుకు కోడలు ఈశ్వర వరంగా వచ్చారు. ఇది ప్రద్యుమ్నుడు ఎంచుకుని చేసుకున్న పెళ్ళి కాదు. ఇది జన్మజన్మాంతర సుకృతం. ఇలాంటి కొడుకు కోడలు సృష్టిలో ఉండరు. పుట్టిన పిల్లవాడిని పెంచి పెద్ద చేసుకొని తన భార్యత్వమును నిరూపించుకొని, భర్తను తీసుకుని వచ్చి తల్లికి అప్పచెప్పిన కోడలు! అత్తగారియందు అంత గౌరవమును చూపించిన కోడలు! ఇంతకన్న నీకు ఏమికావాలి?’ అని చెప్పాడు. రుక్మిణీదేవి గబగబా వచ్చి ప్రద్యుమ్నుడిని, రతీదేవిని ఆప్యాయతతో కౌగలించుకుంది. కృష్ణుడు సంతోషించాడు. అంతఃపురం అంతటా భేరీలు మ్రోగాయి. చచ్చిపోయాడని అనుకున్న పిల్లవాడు బతికి వచ్చాడు. ఆహా! రుక్మిణీ దేవి ఎంత తపస్సు చేసినదో! మరల కొడుకు ఇంతవాడయి కనపడ్డాడు’ అని గోపకులందరూ ఆనందముతో వసంతములు జల్లుకుని పొంగిపోతుంటే రుక్మిణీ కృష్ణులు పొంగిపోతూ కొడుకునూ కోడలినీ ఇంట్లోకి తీసుకువెళ్ళి పెద్ద సంబరములు చేసుకున్నారు. #🙏🏻జై శ్రీ కృష్ణ 🌺 #🙏🏻భక్తి సమాచారం😲 #జై శ్రీకృష్ణ.. జైజై శ్రీకృష్ణ💐 #జై శ్రీకృష్ణ 🚩 #భాగవతం🙏
10 likes
11 shares
Satya Vadapalli
1K views 2 months ago
శ్రీ మధాంధ్ర భాగవతం దశమ స్కంధం - 28 *రుక్మిణీకళ్యాణం* స్వామి ఈ లేఖను చదివి, దానిని పక్కనపెట్టి అగ్నిద్యోతనునీతో ‘ఈ పిల్ల నాకు లేఖ వ్రాయడం కాదు. ఈ పిల్ల గురించి నేను ఎప్పుడో విని రుక్మిణీదేవిని వివాహం చేసుకోవాలని నిద్ర పోగొట్టుకుంటున్నాను. ఎంత తొందరగా వద్దామా అని అనుకుంటున్నాను’ అన్నారు. ఈశ్వరుని దృష్టిలో రాత్రి నిద్రలేదు అంటే ఎవరు తనని పొందాలనుకుంటున్నారో అటువంటి వారిలో అజ్ఞానమును తీసి వాళ్ళను తాను పొందడానికి ఆ మహానుభావుడు ఆర్తి చెందిపోతూ ఉంటాడు. అగ్నిద్యోతనుడు అన్నాడు ‘ఆ అమ్మాయి నీకు తగినది. ఆమెకు నీవు తగినవాడివి. మేము గురువులము. నేను అగ్నిద్యోతనుడిని. అగ్ని అనేది స్వయం ప్రకాశము. అజ్ఞానమును దగ్ధం చేసేస్తుంది. భగవంతుని చూపించేవాడు గురువు. ఈశ్వరదర్శనాభిలాషి అయిన వాడిని భగవంతుని వైపుకి తీసుకువెడతాడు. మేము గురువులము ఆశీర్వచనం చేస్తున్నాము. మీ ఇద్దరికీ వివాహం అవుతుంది. ఇంకా ఎందుకు ఆలస్యం? ఈలోకంలో ఒక గొప్ప సంప్రదాయమును నిలబెట్టు. శరణాగతి చేసిన వారిని ఈశ్వరుడు రక్షిస్తాడనే ఒక ధైర్యం నిలబడాలి. కృష్ణా నీవు వెంటనే బయలుదేరి రావలసినది’ అని చెప్పాడు. ఈమాట వినగానే వెంటనే కృష్ణుడు తన రథసారథిని పిలిచాడు. అన్నగారికి కూడా ఈవిషయం చెప్పలేదు. మనస్ఫూర్తిగా పిలిచిన వాడికోసం పరుగెత్తడానికి పరమాత్మ ఎంత సిద్ధంగా ఉంటాడు. సారథిని పిలిచి రథం సిద్ధం చేయమన్నారు. అగ్నిద్యోతనునితో కలిసి రథం మీద కూర్చుని గబగబా వచ్చేస్తున్నారు. బలరాముడు ‘తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడు?’ అని అడిగాడు. ‘విదర్భరాజ్యములోని కుండిన నగరమునకు రుక్మిణీ దేవిని రాక్షసవివాహం చేసుకొని తీసుకు రావడానికి వెళ్ళారు అన్నారు. అన్నగారి ప్రేమ అన్నగారిది. తమ్ముడు ఒక్కడే వెళ్ళాడని సైన్యమును తీసుకొని వెనకాతల బలరాముడు వెళ్ళాడు. కృష్ణ పరమాత్మ కుండిన నగర వీధులలో తిరుగుతున్నారు. అక్కడి వారు ఆయనను చూసి ఏమి అందగాడు! మహానుభావుడు- ఆ నెమలి పింఛం, ఆ జుట్టు, ఆ నోరు, ఆ గడ్డం, ఆ ముక్కు , ఆ కిరీటం కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరి చందనం చ కలయమ్ కంఠేచ ముక్తావళిం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణిః!! ఎంత అందంగా ఉన్నాడు! నిజంగా వివాహం జరిగితే రుక్మిణీ కృష్ణులకే వివాహం జరగాలి’ అని పొంగిపోతున్న సమయంలో అంతఃపురం లోపల పాపం రుక్మిణీదేవి కంగారు పడుతోంది. ఘను డా భూసురు డేగెనో? నడుమ మార్గశ్రాంతు డై చిక్కెనో? విని కృష్ణుండిది తప్పుగా దలచెనో? విచ్చేసెనో? యీశ్వరుం డనుకూలింప దలంచునో తలపడో? యార్యామహాదేవియున్ నను రక్షింప నెఱుంగునో యెఱుగదో? నా భాగ్య మెట్లున్నదో? ‘అగినిద్యోతనుడు వెళ్ళాడో లేదో! మార్గమధ్యంలో ఏదయినా బడలికను పొందాడో! ఒకవేళ నిజంగా అంతఃపురంలోకి వెళ్లి నేను రచించిన లేఖను ఇచ్చినప్పటికీ ఆడపిల్ల ధూర్తతనంతో ఇలా రాయడమేమిటని కృష్ణుడు రానని అన్నాడో! నేను కృష్ణుని పొందగలనో లేదో’ అని ఆవిడ వ్యాకులత చెందుతోంది. కృష్ణుని చూసిన ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు తగు నీ చక్రి విదర్భరాజసుతకుం; దథ్యంబు వైదర్భియుం దగు నీ చక్రికి; నింత మంచి దగునే? దాంపత్య మీ యిద్దఱిం దగులం గట్టిన బ్రహ్మ నేర్పరిగదా; దర్పాహతారాతియై మగడౌ గావుత జక్రి యీ రమణికిన్ మా పుణ్యమూలంబునన్. ‘నిజంగా చతుర్ముఖ బ్రహ్మగారు ఎంత గొప్పవారో! కృష్ణుడి కోసం రుక్మిణిని పుట్టించాడు. రుక్మిణి కోసం కృష్ణుడిని పుట్టించాడు. వీరిద్దరూ దంపతులయితే ఎంత బాగుంటుందో ! కానీ తండ్రి ఈమెను శిశుపాలునకిచ్చి వివాహం చేస్తాను అంటున్నాడు. వీళ్ళిద్దరికీ వివాహం అవడానికి ఆ శిశుపాలుడి అడ్డం తొలగిపోయి కృష్ణుడు ఈవిడ పక్కన చేరడానికి మా పుణ్యములనన్నిటిని ఇచ్చేస్తాము. మా పుణ్యఫలములను కూడా ఆవిడే తీసుకొని కృష్ణుని భర్తగా పొందాలి’ అని ఆ ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు. ఈశ్వరుని చూసేసరికి ఆ జననీ జనకులిద్దరూ సింహాసనం మీద కనపడాలని లోకం తాపత్రయ పడిపోతుంది. అమ్మవారు అన్న మాటలో ‘ఆర్యామహాదేవి’ అనే ఒక గమ్మత్తయిన మాట ఉన్నది. ఇదే రుక్మిణీ కళ్యాణమునకు ఆయువుపట్టు అంటారు పెద్దలు. బాణత్వం వృషభత్వ మర్థవపుషా భార్యాత్వ మార్యాపతే! ఘోణిత్వం సఖితా మృదంగవహతా చే త్యాది రూపం దధౌ త్వత్పాదే నయనార్పణం చ కృతవాన్ త్వద్దేహభాగో హరిః పూజ్యా త్పూజ్యతర స్స ఏవహి నచే త్కోవా? తదన్యోధికః || శ్రీమహావిష్ణువు శంకరుని అనేక రూపములతో సేవించి సేవించి ఆర్యామహాదేవి అనే పేరుతో పరమశివుని ఇల్లాలు అయినాడు. ఈ ఆర్యామహాదేవికి సంబంధించిన పద్యం విన్నా, చదివినా, ఒక ఫలితం వస్తుంది. ఆడపిల్ల నొసటన అల్పాయుర్దాయం ఉన్నవాడు లేదా ఐశ్వర్య భంగమైపోయిన వాడు లేదా సంతానమును పొందలేని వాడు ఇలాంటి భంగపాట్లు ఉన్న పురుషునితో వివాహం అవాలని ఆడపిల్లకు రాసి వుంటే ఎవరు ఈ పద్యములు వింటున్నారో, ఎవరు ఈ పద్యములు చదువుతున్నారో, ఎవరు రుక్మిణీ కల్యాణం చూస్తున్నారో, వారి నొసటవ్రాత మారి శిశుపాలుడు తప్పి కృష్ణుడు వచ్చినట్లు యోగ్యుడయిన వరుడు వస్తాడు. అందుకని పూర్వం కన్నెపిల్లల చేత రుక్మిణీ కళ్యాణం చదివించేవారు. రుక్మిణీకళ్యాణం చదివినా, చూసినా మనకి కొన్ని కోట్ల జన్మలనుండి వస్తున్న పాపరాశి వలన ఏర్పడిన కర్మవాసనలు తొలగి బుద్ధి చేత ఈశ్వర పాదములు పట్టగలుగుతాము. అది పెళ్లి అయిపోయిన వాళ్లకి వచ్చే ఫలితం. అన్ని స్థాయిలలో ఉన్న వాళ్ళని రుక్మిణీ కళ్యాణం ఉద్ధరించేస్తుంది. అగ్నిద్యోతనుడు రుక్మిణీ దేవి వద్దక పరుగెత్తుకు వచ్చి ‘కన్యకా! కృష్ణుడు నీ గుణములు మెచ్చుకున్నాడు. నీవంటి శిష్యురాలికి గురువయినందుకు నాకు ఎంతో ధనమునిచ్చాడు. సుదర్శన చక్రమును పట్టుకొని వచ్చేశాడు. దేవతలు రాక్షసులు కలిసివచ్చినా సరే రాక్షస వివాహంతో నిన్ను తీసుకువెడతాడు. నీ జీవితం ఫలించింది’ అన్నాడు. రుక్మిణీదేవి పరమసంతోషమును పొందింది. *అమ్మవారు రుక్మిణీదేవి పార్వతీ పరమేశ్వరుల ఆరాధన చేసింది. ఆడపిల్ల అయిదవతనం నిలబడాలంటే గౌరీతపస్సు చేయాలి. గౌరీతపస్సు చేయించేటప్పుడు ఆమెచేత అమ్మవారికి కుంకుమార్చన చేయిస్తారు. అమ్మవారి అనుగ్రహమును ఆ కుంకుమార్చన వలననే పొందగలుగుతారు. కన్య సువాసినిగా మారబోతోంది. ఆ పిల్ల ఆ తరువాత తల్లి కావడానికి అన్నిటికి కావలసిన అదృష్టం అప్పుడే కటాక్షింపబడుతుంది. గౌరీతపస్సు జరుగుతున్నంత సేపు ఆడపిల్ల తదేక దృష్టితో పార్వతీదేవిని ఆరాధన చేయాలి.* అందుకే రుక్మిణీ దేవి ఎవరితో మాట్లాడకుండా మౌనంగా దేవాలయమునకు వెళ్ళింది. భీష్మకుడు కొన్ని మంగళ సూత్రములు చేయించి వృద్ధ ముత్తైదువులకి ఇప్పించాడు. గౌరీతపస్సు అయ్యేవరకు ఆ పిల్ల మాట్లాడకూడదు. మీరు మాట్లాడించకూడదు. ఆమె గౌరీదేవి మీద కుంకుమ వేస్తూ తదేక ధ్యానంతో ఆ నామములు వినాలి. అప్పాలు పరమ పవిత్రమయిన వంటకము. భీష్మకుడు అప్పాలు వండించి ఒక్కొక్క అప్పం, చెఱకుకర్ర, మంగళసూత్రం రుక్మిణి చేత ముత్తైదువలకు ఇప్పించాడు. అప్పుడు చెప్పింది నమ్మితి నా మనంబున సనాతను లైన యుమామహేశులన్ మిమ్ము బురాణదంపతుల మేలు భజింతు గదమ్మ! మేటి పె ద్దమ్మ! దయాంబురాశివి గదమ్మ! హరిం బతి సేయు మమ్మ! నిన్ నమ్మినవారి కెన్నటికి నాశము లేదు గదమ్మ యీశ్వరీ ! సనాతనులయిన పార్వతీ పరమేశ్వరులను నేను మదిలో నమ్ముకుని ఉన్నాను. మీరు ఇద్దరు కూడా సనాతనముగా ఆదిదంపతులు. అమ్మా! నీవు తరగని అయిదవతనంతో ఉన్నావు. అలా నన్ను కూడా అయిదవతనంతో నిలబెట్టవా! ఓ యీశ్వరీ! నీవు దయకు సముద్రము వంటి దానివి. కృష్ణుని నాకు భర్తగా చేయవలసింది. నిన్ను నమ్మిన వాళ్లకు ఎన్నటికీ నాశనమన్నది లేదు. రక్షించి తీరుతావు’ అన్నది. తాను చేసిన ఆరాధనకు కృష్ణుడు వచ్చి తీరుతాడని తలచినది. రుక్మిణీదేవి సౌందర్యమును చూసిన ఎందరో రాజులు తట్టుకోలేక తమ తమ రథముల నుండి క్రింద పడిపోయారు. కనియెన్ రుక్మిణి చంద్రమండలముఖుం గంఠీరవేంద్రావ ల గ్ను నవాంభోజదళాక్షుజారుతరవక్షున్ మేఘ సంకాశ దే హు నగారాతి గజేంద్ర హస్తనిభబాహుం జక్రి బీతాం బరున్ ఘనభూషాన్వితు గంబుకంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్. రుక్మిణీ దేవికి, రథంలో నిలబడి పట్టుపీతాంబరము కట్టుకొని, ఎడం చేతితో అలవోకగా పగ్గములు పట్టుకుని చిరునవ్వుతో రుక్మిణీదేవి వంక చూస్తూ, నవ్వుతూ నిలబడిన కంబుకంఠుడయిన పరమాత్మ దర్శనం అయింది. పగ్గములు విడిచిపెట్టాడు. రథమును దిగాడు. శరణాగతి చేసిన వారి కోసం తానే దిగి నడిచి వచ్చాడు. శరణాగతిలో ఈశ్వర వైభవం ప్రకాశించింది. ఈశ్వర ప్రతిజ్ఞ! తానే రథం దిగి నడిచి వచ్చాడు. అలవోకగా అమ్మవారి చెయ్యి పట్టుకున్నాడు. తన రథం ఎక్కించుకున్నాడు. ఇంతమందీ వాళ్ళిద్దరినీ చూస్తూనే ఉన్నారు. ఎవరికీ స్పృహ లేదు. రథమును తోలుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తరువాత వీళ్ళందరికీ స్పృహ వచ్చింది. కృష్ణుడు రుక్మిణీ దేవిని ఎత్తుకుపోయాడు అన్నారు. పరుగు పరుగున వెళ్లి ఈ విషయమును శిశుపాలుడికి, జరాసంధుడికి చెప్పారు. కొంతమంది కృష్ణుని పట్టుకుందామని కృష్ణుని రథం వెంట పడ్డారు. కృష్ణుడు సుదర్శన చక్రంతో వారి కుత్తుకలను కత్తిరించేశాడు. శిశుపాలుడు జరాసంధుడి దగ్గరకు వెళ్ళాడు జరాసంధుడు అన్నాడు బ్రతకవచ్చు నొడల ప్రాణంబులుండిన బ్రతుకు కలిగెనేని భార్య కలదు బ్రతికితీవు; భార్యపట్టు దైవమెరుంగు, వగవ వలదు చైద్య! వలదు వలదు. శిశుపాలా! నీవు చాలా అదృష్టవంతుడివి. కృష్ణుడి దగ్గరకు వెళ్లి చచ్చిపోకుండా వెనక్కి వచ్చావు. పెళ్లి అయిపోతే పోయింది. మరొక భార్య దొరుకుతుంది. బ్రతికానని సంతోషపడు’ అన్నాడు. ఒక్క రుక్మి మాత్రం ఒక గోపాల బాలుడు తన చెల్లిని అపహరించడం ఏమిటని అపారమయిన ఆవేశంతో కృష్ణుని రథం వెంట పడి మా సరివాడవా మా పాప గొనిపోవ? నేపాటి గలవాడ? వేది వంశ? మెందు జన్మించితి? వెక్కడ బెరిగితి? వెయ్యది నడవడి? యెవ్వడెఱుగు? మానహీనుడ వీవు? మర్యాద లెఱుగవు; మాయ గైకొని కానీ మలయ రావు; నిజరూపమున శత్రు నివహంబుపై బోవు; వసుధేశుడవు గావు వావి లేదు; కొమ్మ నిమ్ము; నీవు గుణరహితుండవు, విడువు; విడువవేని విలయకాల శిఖిశిఖా సమాన శిత శిలీముఖముల గర్వమెల్ల గొందు గలహమందు. రుక్మి తెలియకుండానే స్తుతి చేసేస్తున్నాడు. ‘నువ్వు గోపాల బాలుడివి. ఎక్కడో పుట్టిన వాడివి. ఆలమందల వెనకాల తిరిగిన వాడివి. నీకు మా పిల్ల కావలసి వచ్చిందా! మా పిల్లను ఎత్తుకు పోతావా? నిలు నిలు కృష్ణా! నిన్ను ఇప్పుడే తుదముట్టించేస్తాను’ అని వస్తున్నాడు. కృష్ణుడు చూశాడు. రుక్మి తనను ఇంత నింద చేస్తున్నాడు. అది స్తుతిపాఠం అయింది. నిజంగా పరమాత్మకు జన్మమేమిటి? కులం ఏమిటి? వంశం ఏమిటి? ఇది తెలియక వెర్రివాడు ప్రలపిస్తున్నాడు. కృష్ణ పరమాత్మ ఒక్కసారి సుదర్శన చక్రమును చేత్తో పట్ట్టుకొని సంకల్పం చేస్తున్నారు. అని డగ్గుతికతో మహాభయముతో నాకంపితాంగంబుతో వినత శ్రాంత ముఖంబుతో శ్రుతిచలద్వేణీ కలాపంబుతో గనుదోయిన్ జడిగొన్న బాష్పములతో గన్యాలలామంబు మ్రొ క్కిన రుక్మిం దెగవ్రేయబోక మగిడెన్ గృష్ణుండు రోచిష్ణుఁడై. అసలు కన్నులమ్మట నీరు పెట్టవలసిన అవసరం లేక తన కడగంటి చూపులతో లోకమునకు ఐశ్వర్యము నీయగలిగిన శ్రీమహాలక్ష్మి తనతోడబుట్టిన వాడు మరణిస్తాడేమోనని ఇంకా పెళ్ళి కాకుండానే కృష్ణుడితో వెళుతున్నది భయపడి పోయి వణికిపోతున్న శరీరముతో ఆయన కాళ్ళు పట్టుకొని కళ్ళ వెంబడి నీళ్ళు కారిపోతుండగా ఈశ్వరా! నా అన్నకు ప్రాణ భిక్ష పెట్టు’ అని ఆయన పాదములు పట్టుకున్నది. కృష్ణుడు ‘వీనికి ప్రాణం తీసినంత పని చేస్తాను’ అని కిందికి దిగి, కత్తి తీసి, రుక్మి తల పట్టుకొని పాయలు పాయలుగా తల, గెడ్డం గొరిగేసి వదిలి పెట్టేశారు. వాడు గుంజుకుంటుంటే కృష్ణుడు తనపై ఉత్తరీయము తీసి రుక్మిని బండికి వేసి కట్టేసి తల గొరిగి విరూపుని చేసి వదిలేశారు. రుక్మిణీదేవి చాలా బాధ పడింది. బలరాముడు వచ్చి ఓదార్చాడు. తదనంతర రుక్మిణీ కృష్ణులు హాయిగా ద్వారకా నగరమును చేరుకున్నారు. ధ్రువకీర్తిన్ హరి పెండ్లి యాడె నిజ చేతోహారిణిన్ మాన వై భవ గాంభీర్య విహారిణిన్ నిఖిల సంపత్కారిణిన్ సాధు బాం ధవ సత్కారిణి బుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణిన్ సువిభూషాంబర ధారిణిన్ గుణవతీ చూడామణిన్ రుక్మిణిన్. శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని పెండ్లి చేసుకున్నాడు. మంచి పట్టుపుట్టం కట్టుకున్నది, దరిద్రమును నాశనం చేయగలిగినది, ఇంటికి వచ్చిన బంధువులను స్నేహితులను ఆదరముతో చూడగలిగినది, పుత్రపౌత్రాభివృద్ధిగా వంశమును పెంచగలిగినది, చక్కటి చిరునవ్వుతో అందరిని ఆదరించే స్వరూపం ఉన్నది, మంచి గుణములు కలిగినదయిన రుక్మిణీ దేవిని కృష్ణుడు ద్వారకా నగరమునందు పెద్దలందరి సమక్షములో వివాహమును చేసుకున్నాడు. అనఘ! ఆదిలక్ష్మియైన రుక్మిణి తోడ గ్రీడ సలుపుచున్న కృష్ణు జూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి, ప్రీతి లగుచు ముక్త భీతు లగుచు. ఆ శ్రీమహాలక్ష్మియే రుక్మిణీ దేవి. ‘ఆవిడ పక్కన కృష్ణుడు కూర్చుంటే ఆవిడ మన మొరలు వినిపిస్తుంది. దయాశాలియై మనలను రక్షిస్తుంది. ఇంక మనకి ఏమి కావాలి! మనం అందరం భయములను వదిలిపెట్టి పరమసంతోషంగా ఉండవచ్చు’ అని ప్రజలందరూ భావించారని శుకయోగీంద్రుడు పరీక్షిత్తుకు రుక్మిణీకళ్యాణగాథ వినిపించాడు. #భాగవతం🙏 #జై శ్రీకృష్ణ 🚩 #జై శ్రీకృష్ణ.. జైజై శ్రీకృష్ణ💐 #🙏🏻జై శ్రీ కృష్ణ 🌺 #🙏🏻భక్తి సమాచారం😲
15 likes
16 shares